కపిల్ పైకి షోయబ్‌ మరో బౌన్సర్

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విరాళాల సేకరణ కోసం భారత్‌-పాక్‌ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలన్న షోయబ్ అక్తర్‌ వ్యాఖ్యలను టీమ్‌ఇండియా దిగ్గజం కపిల్‌దేవ్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అక్తర్‌ స్పందించాడు.

‘నేనేం చెప్పదల్చుకున్నానో కపిల్‌ భాయ్‌ సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేడు. ఈ మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ సమయంలోనే మనమంతా కలిసికట్టుగా ఉండి ఆదాయాన్ని పెంపొందించుకోవాలి. భారత్‌-పాక్‌ మధ్య క్రికెట్‌ నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తారు. తమకు డబ్బు అవసరం లేదని కపిల్‌ అన్నారు. అది నిజమే. కానీ అందరూ అలా ఉండరు కదా? నేను ప్రతిపాదించిన ఈ విషయాన్ని త్వరలోనే పరిగణిస్తారని భావిస్తున్నా’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. మరీ అక్తర్ తాజా కామెంట్ పై కపిల్ రియాక్షన్ ఏంటన్నది చూడాలి.