తారక్-చరణ్’ల మధ్య తేడా అదే : రాజమౌళి

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఇద్దరే అంటున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. కరోనా లాక్‌డౌన్ తో ఇంటికే పరిమితమైన రాజమౌళి ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ విశేషాలని పంచుకున్నారు. తారక్, చరణ్… ఇద్దరిలోనూ అల్లరి ఎక్కువ. అయితే తారక్ కనిపించేలా అల్లరి చేస్తాడు. చరణ్ చేసే అల్లరి కనిపించదు, అంతే తేడా !

వాళ్లిద్దరినీ ఒక పొజిషన్ లో నిల్చోబెట్టి సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లడమనేది నాకు కష్టమైన పని. ఒకరినొకరు గిల్లుకోవడమో, వెక్కిరించుకోవడమో జరుగుతూనే ఉంటుంది. ఒకరికి సీరియస్ గా చెబుతుంటే ఇంకొకరు మరోలా మొహం పెడుతుంటారని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

బాహుబలి సమయంలో ప్రభాస్-రానా కూడా అల్లరి చేసేవారు. కానీ ఇంతలా కాదు. షాట్ అయ్యాక ప్రభాసే రానాని కెలుకుతూ, ఏడిపిస్తూ ఉండేవాడు. షాట్ జరుగుతున్నప్పుడు మాత్రం కుదురుగా ఉండేవారని తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేశాక ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవాలన్నారు.