అభిమానులకి రిషీ కపూర్ ఫ్యామిలీ రిక్వెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీ కపూర్ కన్నుమూశారు. రెండేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న రిషీ కపూర్ ఈ ఉదయం కన్నుమూశారు. దీంతో బాలీవుడ్ శోక సముద్రంలో మునిగిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు, రాజకీయ నేతలు రిషీ కపూర్ కి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఈరోజే రిషీ కపూర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులకి రిషీ కపూర్ కుటుంబం ఓ లేఖ రాసింది.

“మేము ఎంతో ప్రేమించే రిషి కపూర్ ల్యుకేమియాపై రెండేళ్ల పాటు పోరాడి ఈ ఉదయం 8.45కి మృతి చెందారు. ఎంతో ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి శ్వాస వరకు తమను ఎంతో ఎంటర్టైన్ చేశారని ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ చెప్పారు. రెండు ఖండాల్లో రెండేళ్ల పాటు రిషి చికిత్స పొందారు. చికిత్స సమయంలో కూడా ఆయన ఎంతో సంతోషంగా, సరదాగా ఉన్నారు. తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. కుటుంబం, స్నేహితులు, ఆహారం, సినిమాలు వీటి గురించే ఎక్కువగా ఆలోచించేవారు. ఈ రెండేళ్ల కాలంలో ఆయనను చూసేందుకు వచ్చినవారంతా…  క్యాన్సర్ ను ఆయన ఎదుర్కొంటున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు.అభిమానులు చూపించే అభిమానం పట్ల ఆయన ఎంతో సంతోషించేవారు. తన మరణం తర్వాత కూడా అభిమానులందరూ చిరునవ్వుతోనే తనను గుర్తుంచుకోవాలని… కంటతడితో కాదనే విషయాన్ని ఆయన కోరుకున్నారు. అభిమానులంతా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది చాలా బాధాకరమైన సమయం. కరోనా నేపథ్యంలో ప్రజల కదలికలు, సామూహిక కలయికలపై ఆంక్షలు ఉన్నాయి. చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించాలని కోరుతున్నాం. రిషి చివరి చూపు కోసం ఎవరూ రావద్దు. అందరూ ఇంటి వద్దే ఉండండి” ఓ లేఖని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.