తండ్రి కడచూపుకి నోచుకోని రిషి కపూర్ కూతురు

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని మరీనా లైన్స్‌లోని చందన్‌వాడీ స్మశానవాటిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. అయితే తండ్రి చివరి చూపుకి నోచుకోలేకపోయింది రిషి కూతురు రిద్ధిమా కపూర్. లాక్‌డౌన్ నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రిద్ధిమా కపూర్ సహా మొత్తం ఐదుగురు ఢిల్లీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా 1400కి. మీ ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇందుకు ప్రభుత్వ అనుమతి దొరకడం ఆలస్యం అయింది.

ప్రైవేట్ విమానం ద్వారా ముంబై చేరుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు, సాయంత్రం 5గంటల లోపు అంత్యక్రియలు పూర్తి చేయాలని పోలీసులు ఆదేశించడంతో.. రిద్ధిమా కపూర్ తండ్రి కడ చూపుకి నోచులేకపోయింది. ముంబై చందన్‌వాడి శ్మశానంలో జరిగిన అంత్యక్రియలకు రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. అంతిమ వీడ్కోలు పలికారు.