ఎన్టీఆర్ అభిమానులపై పవన్ హీరోయిన్ ఫిర్యాదు


హీరోయిన్ మీరా చోప్రా గుర్తుందా ? ‘బంగారం’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి జోడీగా నటించింది. ఆ తర్వాత వాన, మారో, గ్రీకు వీరుడు సినిమాల్లో మెరిసింది. అయితే తెలుగులో బిజీ హీరోయిన్ కాలేకపోయింది. తమిళ్, హిందీ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఇప్పుడీ హీరోయిన్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తగులుకున్నారు. ఓ రేంజ్ లో వేసుకున్నారు. ఆ దెబ్బకు తట్టుకోలేక మీరా చోప్రా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. తారక్ అభిమానులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది.

ఇంతకీ తారక్ అభిమానులు మీరాని ఎందుకు తగులుకున్నట్టు ? అంటే..  సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మీరా ..తాజాగా #askmeera వేదికగా ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?’ అని ప్రశ్నించాడు. ‘నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు’ అని మీరా సమాధానమిచ్చింది. దీంతో తారక్ అభిమానులకి కాలింది. ఆమెపై బూతు కామెంట్స్ తో విరుచుకు పడ్డారు. దీంతో ఆవేదనకు గురైన మీరా ట్విటర్‌ వేదికగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

‘హైదరాబాద్‌ సిటీ పోలీస్‌, సైబర్‌క్రైమ్‌ పోలీసులకు .. ఈ ట్విటర్‌ ఖాతాదారులందరిపై ఫిర్యాదు చేస్తున్నాను. వీళ్లందరూ గ్యాంగ్‌రేప్‌, చంపేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు. దురదృష్టకరం ఏమిటంటే వీళ్లందరూ ఎన్టీఆర్‌ అభిమానులు. ట్విటర్‌.. మీరు కూడా ఈ ట్వీట్లను ఒక్కసారి గమనించి, వెంటనే సదరు అకౌంట్లను తొలగించాలని కోరుకుంటున్నాను.’ అని మీరా ట్వీట్‌ చేశారు.

అంతేకాదు.. ఎన్టీఆర్ ని సూటిగా ప్రశ్నించారు మీరా చోప్రా. ‘ఎన్టీఆర్‌.. మీకంటే ఎక్కువగా మహేశ్‌ బాబుని అభిమానిస్తున్నానని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఉంటే విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా?’ అని మీరా ట్విట్ చేసింది. మరీ.. మీరా ట్విట్ పై తారక్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.