సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ.. ఏం చర్చించారంటే ?

ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్‌తో భేటీ అయ్యారు. అగ్ర నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై సీఎంతో చర్చించారు.

రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ల్యాబ్‌ ఏర్పాటుపై అనుమతి ఇవ్వాలని ఇప్పటికే లేఖ రాయగా, ఈ అంశంపైనా చర్చించినట్లు సమాచారం. చిరంజీవి నేతృత్వంలో 25మంది సినీ ప్రముఖుల బృందం సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏడుగురికి మాత్రమే కలిసే అవకాశం ఉంటుందని చెప్పడంతో కొద్ది మందికి మాత్రమే అవకాశం లభించింది.