నిమ్మగడ్డ కేసు : సుప్రీంలోనూ జగన్ సర్కార్’కు నిరాశ

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీంలో వాదనలు జరిగాయి. హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని సుప్రీం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.

ఈకేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని, వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. రెండు వారాల్లో ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రమేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని రమేశ్‌కుమార్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని, రెండు వారాల తర్వాత మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం స్పష్టం చేసింది.