సింపుల్ గా బాలయ్య బర్త్ డే వేడుకలు


నటసింహం నందమూరి బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. షష్టి పూర్తి కూడా. పరిస్థితులు సాధారణంగా ఉంటే బాలయ్య షష్టిపూర్తి వేడుక అంగరంగ వైభవంగా జరిగేది. అయితే కరోనా ఎఫెక్ట్ తో బాలయ్య బర్త్ డే వేడుకని సింపుల్ గా జరుపుకున్నారు. ఫ్యామిలీ వేడుకగా నిర్వహించారు.

హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లిన బాలయ్య.. ముందుగా ఆసుపత్రిలో తన తల్లిదండ్రుల విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి.. వారికి నోట్‌ పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న బాలయ్య కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో బాలయ్య బావ, తెదేపా అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ…”నాకు అప్పుడే 60 ఏళ్లు వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు. మద్రాసులో పుట్టిన నేను ఆరేళ్ల వయస్సులో హైదరాబాద్‌కు వచ్చాను. అందరి కృషితోనే ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రిలో పరిస్థితి బాగుంది. ఎందరో దాతల విరాళాలతో క్యాన్సర్‌ రోగులకు మంచి చికిత్స అందిస్తున్నాం. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి త్వరలో మనల్ని వీడి పోవాలని కోరుకుంటున్నా. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలను పాటించాలి” అని అన్నారు.