అచ్చెన్నాయుడిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్  !

మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడి అరెస్టయ్యారు. ఈఎస్‌ఐ స్కామ్ లో ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈ ఉదయం 7.30గంటలకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అయితే అచ్చెన్నాయుడు అరెస్ట్ ని తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ పై తెదేపా అధినేత చంద్రబాబు ట్విట్ల వర్షం కురిపించారు. అచ్చెన్నాయుడిది అరెస్ట్ కాదు.. కిడ్నాప్. ఎందుకు కిడ్నాప్ చేసారు ? ఎక్కడికి తీసుకెళ్లారు ? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

‘తెలుగుదేశం శాసనసభ్యులు  అచ్చెన్నాయుడుగారు ఏమయ్యారు? నాతో సహా, వారి కుటుంబ సభ్యులెవరికీ ఆయన ఫోను అందుబాటులో లేదు. ఈ ప్రభుత్వం ఆయనను ఏం చేసింది? ఆయన్ను100 మంది పోలీసులతో అక్రమంగా, చట్ట విరుద్ధంగా ఎందుకు కిడ్నాప్ చేయించారు?’

‘ఎక్కడకు తీసుకువెళ్ళారో తెలియదు, ఎందుకు తీసుకెళ్లారో తెలియదు.. ముందస్తు నోటీసు ఇవ్వలేదు..బడుగు, బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడుతున్న అచ్చెన్నాయుడుగారిపై జగన్ కక్షగట్టి ఇలా కిడ్నాప్ చేయించడం దారుణం. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’

‘దీనికి సీయం జగన్‌, హోంమంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలి. ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యలకు నిరసనగా బడుగుబహీనవర్గాలవారు, మేధావులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా జోతిరావుఫూలే, అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి తమ నిరసనను తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ వరుస ట్విట్ చేశారు చంద్రబాబు.