కల్నల్ సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు

ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభం అయింది. కేసారం వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు కేవలం 50మందికి మాత్రమే అనుమతినిచ్చారు. ఆర్మీ అధికారులు, కుటుంబ సభ్యులకి మాత్రమే అనుమతిని ఇచ్చారు.

గత యేడాది మార్చిలో చివరిసారిగా సంతోష్ బాబు సూర్యపేటకు వచ్చారు. సంతోష్ బాబు మృతితో సూర్యపేట శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన్ని కడసారిచూసేందుకు నగరవాసులు ఉదయం నుంచే బారులు తీరారు. అతనితో తమకున్న అనుబంధాన్ని తలచుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో ఆర్మీ మేజర్లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ముందుగా ఆర్మీ అధికారుల లాంఛనాల మేరకు కల్నల్‌ సంతోష్‌ బాబుకు సైనికులు నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సాంప్రదాయాలకు అనుగుణంగా అంతిమసంస్కారాలు నిర్వహిస్తారు.