కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సాయం రూ. 5కోట్లు


భారత్-చైనా దళాల మధ్య ఘర్షణలో 20మంది భారతీయ జవాన్లు వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. వీరిలో సూర్యపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు ఒకరు. ఆయన కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల నగదు, నివాస స్థలం, ఆయన భార్యకు గ్రూప్- 1 స్థాయి ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదే ఘర్షణలో మరణించిన మిగతా 19 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్ర రక్షణ మంత్రి ద్వారా ఈ సాయాన్ని అందిస్తామని సీఎం వెల్లడించారు.

“సరిహద్దుల్లో దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలి. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలి. తద్వారా సైనికుల్లో ఆత్మవిశ్వాసం, వారి కుటుంబాల్లో భరోసా నింపాలి. దేశమంతా మీ వెంటే ఉందనే సందేశం అందించాలి. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఎలాగూ సాయం చేస్తుంది. రాష్ట్రాలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే సైనికులకు, వారి కుటుంబాలకు దేశం మా వెంట నిలుస్తుందనే నమ్మకం కుదురుతుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలి” అని సీఎం కేసీఆర్ అన్నారు.