కరోనా కేసులు : మూడో స్థానంలోకి భారత్

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. గత కొన్నాళ్లుగా ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య 20వేలకిపైగా నమోదవుతున్నాయి. సోమవారం నాటికి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబిజాతో భారత్ మూడో స్థానంలోకి చేరింది. దాదాపు 29లక్షల కేసులు, లక్షా 30వేల మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 16లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక 6లక్షల 80వేలతో మూడోస్థానంలో ఉన్న రష్యాను తాజాగా భారత్ దాటవేసింది.

ఆదివారం ఒక్కరోజే భారత్‌లో 24,248పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్.  దీంతో దేశంలో కరోనా వైరస్ మొత్తం బాధితుల సంఖ్య 6,97,413కి చేరింది. కొత్తగా 425మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 19,693గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా బారినపడ్డవారిలో ఇప్పటివరకు 4,24,433 మంది కోలుకోగా మరో 2,53,287యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక కరోనా మరణాల్లో ప్రపంచంలోనే భారత్ 8వ స్థానంలో ఉంది.