ఎన్నాళ్లో వేచిన ఉద‌యం… !

దాదాపు ఏడాది త‌రువాత పీఎం మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు క‌ల‌వ‌నున్నారు. ప్రధానితో చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఖరారైందని పీఎంవో వర్గాలు వెల్ల‌డించాయి. ఈనెల 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. దాదాపు ఏడాది కాలం తర్వాత వీరిద్దరూ సమావేశం అవుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌త కొంత కాలంగా ఏపీలో బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం కొన‌సాగుతోంది. అందుకే చంద్రబాబుకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటూ వార్తలొచ్చాయి కూడా. ఈ నెల 12వతేదీన సీఎం చంద్రబాబుకు ప్రదాని మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య ఎలాంటి చ‌ర్చ జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా విభజన హామీలు, పోలవరం తదితర అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.