దేశంలో 15లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,513 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 15,31,669కు చేరింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 768మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారిసంఖ్య 34,193కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా బాధితుల్లో ఇప్పటికే 9,88,029 మంది కోలుకోగా మరో 5,09,447 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24శాతానికి చేరగా, మరణాల రేటు 2.25శాతంగా ఉంది. దేశంలో తొలి ఐదు లక్షల కేసులు నమోదుకావడానికి దాదాపు 148రోజులు పట్టింది. అనంతరం మరో 20రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపై 10లక్షల మార్కును దాటింది. తాజాగా 10లక్షల కేసుల నుంచి 15లక్షల కేసులు నమోదుకావడానికి కేవలం 12రోజుల సమయం మాత్రమే పట్టింది.