కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసులు 50వేలకుపైగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 55,078 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 16,38,870కు చేరింది. గడిచిన 24గంటల్లో మరో 779 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 35,747కు చేరింది.

దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో భారత్‌ ఐదో స్థానానికి చేరింది. 35,132 మరణాలతో ఇటలీ ఆరో స్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌, యూకే, మెక్సికో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 10లక్షల 57వేల మంది కోలుకున్నారు. మరో 5లక్షల 45వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.54శాతం ఉండగా, మరణాల రేటు 2.18శాతంగా ఉంది.