కరోనాపై 72గంటల ఫార్ములా

కరోనా కట్టడి కోసం 72గంటల ఫార్ములాని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశంలో కరోనా పరిస్థితులు, అన్‌లాక్‌ అమలుపై నేడు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో దాదాపు 80శాతం పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో పది రాష్ట్రాలు వైరస్‌ను కట్టడి చేయగలిగితే కరోనా పోరులో భారత్‌ విజయం సాధించినట్లేనని పునరుద్ఘాటించారు. అందుకే ఈ రాష్ట్రాల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. ముఖ్యంగా బిహార్‌, గుజరాత్‌, యూపీ, పశ్చిమబెంగాల్‌, తెలంగాణల్లో కొవిడ్‌ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని, పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని అభిప్రాయపడ్డారు.

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర  72 గంటల ఫార్ములాని సూచించారు. వైరస్‌ సోకిన వ్యక్తిని 72గంటల్లోగా గుర్తించి పరీక్షిస్తే వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వైరస్‌ నిర్దారణ అయిన వ్యక్తిని కలిసిన వారు కూడా 72గంటల్లోపే పరీక్షలు చేయించుకోవాలని ప్రధాని సూచించారు.