కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్‌షా స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 1007 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040కి పెరిగింది.