కరోనా నుంచి కోలుకున్న సింగర్ సునీత

సింగర్ సునీత కరోనాని జయించారు. కరోనా బారినపదిన ఆమె తాజాగా కోలుకున్నారు. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా ఓ వీడియో ద్వారా ప్ర‌క‌టించి అభిమానుల‌కు ఊర‌ట క‌లిగించారు. అదే సమయంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  కోలుకోవాలని ఆకాంక్షించారు.

“అందరికీ నమస్కారం. నా ఆరోగ్యం గురించి బంధువులు, స్నేహితులు, మీడియా నుంచి వరుస ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చా. కొన్ని రోజుల కిందట నేను కరోనా బారిన పడ్డా. ఒక షూటింగ్‌కు వెళ్తే తలనొప్పిగా అనిపించింది. అశ్రద్ధ చేయకుండా నా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని పరీక్ష చేయించుకున్నా. దురదృష్టవశాత్తూ పాజిటివ్‌ అని వచ్చింది. చాలా స్వల్ప లక్షణాలు ఉన్నాయి. సాధారణ జీవితంలో అలాంటివి మనం లెక్క చేయం. ఇప్పుడు నేను పూర్తిగా కరోనా నుంచి బయటపడ్డా. ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు నేను బాలుగారి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళనగా ఉన్నా. నేను, నా కుటుంబం ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. మనందరం ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం” అని సునీత పేర్కొన్నారు.