ఈ నెల 21 వరకు కస్టడీలోకి రియా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇవాళ సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి..  కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రవేశపెట్టారు. రియాకు కోర్టు ఈ నెల 21 వరకు కస్టడీకి అప్పగించింది.

సుశాంత్‌ మరణంపై నమోదైన కేసు దర్యాప్తును చేపట్టిన సీబీఐ అధికారులు 28 ఏళ్ల రియాను విచారించిన సందర్భంలో ఆమె వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించారు. అందులో డ్రగ్స్‌కు సంబంధించిన సంభాషణ ఉండటంతో ఈ కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ ఈ కేసులో రియా సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ కేసులో మూడు రోజుల విచారణ తర్వాత రియాని కూడా అరెస్ట్ చేశారు.