బాలు అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగింది. కరోనా నుంచి ఇటీవల కోలుకున్న ఆయన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. బాలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తిరువల్లూరు జిల్లా తామరై పాక్కం ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసారు.

ఆగస్టు 5న బాలు కరోనాతో బాలు చెన్నై ఎజీఎంలో చేరారు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో అదే నెల 14న ఆయనకు కృత్రిమశ్వాస అందించటం మొదలుపెట్టారు. దాంతో క్రమంగా కోలుకున్న బాలు ఈ నెల 4న కరోనా నుంచి బయటపడ్డారు. పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్‌ వచ్చిందని దవాఖాన వర్గాలు 4వ తేదీన ప్రకటించటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటినుంచి ఫిజియో థెరపీ తదితర చికిత్సలు అందించటంతో తనంతతానుగా ఆహారం తీసుకొనే స్థితికి చేరుకున్నారు. అయితే గురువారం ఒక్కసారిగా బాలు ఆరోగ్యం విషమించింది. ఆ తర్వాత 24 గంటలు గడవకుండానే బాలు మరణవార్త వినాల్సి వచ్చింది.