హైదరాబాద్ లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

ఐపీఎల్ 2020 రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లకి ఫుల్లుగా పనిదొరికింది. టాస్ నుంచి మొదలుపెడితే ప్రతి దానిపై బెట్టింగ్ పెడుతున్నారు. బాల్ టు బాల్ పెట్టింగులు కూడా నడుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ బాలానగర్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్‌ చేశామన్నారు.

నిందితుల నుంచి రూ.22.89లక్షల నగదు, 8 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు. కొంతమంది నెట్‌వర్క్‌ మాదిరిగా ఏర్పడి ప్రతి బంతిపై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. కొంతమంది విద్యార్థులు కూడా ఈ బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేసి 30 మందిని అరెస్ట్‌ చేశామని.. నిందితుల నుంచి రూ.40లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.