పూరి ఆఫీసులో ప్రభాస్.. ఏంటీ సంగతి !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యారు. రాధేశ్యామ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చారు. తాజాగా ఈరోజు దర్శకుడు పూరి ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఛార్మి పెంపుకుడు కుక్కతో సరదా ఆడుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోని ఛార్మి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పుడీ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయం పక్కనపెడితే.. ప్రభాస్ తో పూరి ఏదైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా ? అనే చర్చ మొదలైంది. గతంలో పూరి-ప్రభాస్ కలయికలో రెండు సినిమాలు బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వచ్చాయ్. వీటిలో బుజ్జిగాడు ఆకట్టుకున్నాడు. ఏక నిరంజన్ నిరాశపరిచింది. అయినా.. పూరి అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ తెలిపారు.

ఇక ఫైటర్ సినిమాతో పూరి పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కూడా పూరి మరో పాన్ ఇండియా చేయబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కేజీఫ్ హీరో యష్ ఇందులో హీరోగా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభాస్ పూరి ఆఫీసులో కనిపించడంతో.. ప్రభాస్ తో పూరి ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నారా? అని చెప్పుకొంటున్నారు.