గ్రేటర్‌లో ఫైనల్ పోలింగ్‌ శాతం ఎంతంటే ?

గ్రేటర్‌లో 149 డివిజన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్‌ శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్ వెల్లడించారు. 46.55శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఆర్‌సీపురం డివిజన్‌లో 67.71 శాతం.. అత్యల్పంగా యూసఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

వాయిదా పడిన ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌కు రేపు పోలింగ్ జరగనుంది. సీపీఐ, సీపీఎం పార్టీల గుర్తులు తారుమారు కావడంతో ఇక్కడ పోలింగ్ వాయిదా పడినసంగతి తెలిసిందే. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందుకోసం డివిజన్‌ పరిధిలో 69 పోలింగ్ కేంద్రాలను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది.

ఇక జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు ఈ నెల 4న జరగనుంది. మొత్తం 30 కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 31 మంది పరిశీలకులను నియమించింది. వారిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వీరంతా లెక్కింపు ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది.