ఏపీలో 5 కేంద్రాల్లో మొదలైన కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌- 19 వాక్సినేషన్‌ డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కృష్ణా జిల్లాలో ఐదు చోట్ల అధికారులు డ్రైరన్‌ను ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

ఇందుకోసం మొత్తం ఐదు కేంద్రాలని ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్‌ పీహెచ్‌సీలలో డ్రైరన్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. టీకా డ్రైరన్‌కు ప్రతి కేంద్రంలో ఐదుగురు సిబ్బంది, 3 గదులను ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్‌, రెండో గదిలో వ్యాక్సినేషన్‌, మూడో గదిలో పరిశీలన జరగనుంది.