రజనీకాంత్ యూటర్న్.. ఊహించినదే !

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకున్నారు. రాజకీయాల్లోకి రావడం లేదంటూ సంచలన ప్రకటన చేశారు. దీనికి కరోనా కాలం. తన ఆరోగ్యం. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నానని.. రాజకీయాల్లోకి రావడం లేదని రజనీ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో మూడు పేజీల లేఖని విడుదల చేశారు.

“ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల 120 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు.

అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్‌మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలువలేదు. అయితే నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది” అని రజనీ లేఖలో పేర్కొన్నారు.

అయితే రజనీ పొలిటికల్ యూటర్న్ ఊహించినదేనని ఆయన అభిమానులు, తమిళ ప్రజలు అంటున్నారు. రజనీ మొదటి నుంచి పొలిటికల్ ఎంట్రీకి వందశాతం ఆసక్తిగా లేరు. అభిమానులు రమ్మంటున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉందని భావించారు. రాజకీయాల్లోకి ప్రజలకి మరింత సేవ చేయొచ్చు అనుకున్నారు. కానీ ఆయన దగ్గర పొలిటికల్ వ్యూహాం లేకుండా పోయింది. ఇటీవల అనారోగ్యానికి గురుకావడం.. ఒత్తిడికి గురికావడం వలనే ఇలా జరిగిందని డాక్టర్లు తేల్చడంతో రజనీ పొలిటికల్ ఎంట్రీపై యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.