యూకే విమానాల బ్యాన్ పొడగింపు

బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ వెలుగులోనికి వచ్చిన నేపథ్యంలో భారత్-బ్రిటన్‌ మధ్య ఈ నెల 23 నుంచి 31 వరకు విమాన సేవలను కేంద్రం తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ.. ఈ నిషేధాన్ని భారత ప్రభుత్వం మరికొంత కాలం పొడిగించింది. వచ్చే ఏడాది జనవరి 7 వరకు బ్రిటన్‌కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ బుధవారం వెల్లడించారు. ఆ తర్వాత కఠిన ఆంక్షల నడుమ సేవల పునరుద్ధరణ ఉంటుందని తెలిపారు.

మరోవైపు దేశంలో కొత్త రకం కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 20 మందికి కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తేలింది. దీంతో వీరిని ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్రం వెల్లడించింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇద్దరికి కొత్త రకం కరోనా సోకినట్టు గుర్తించారు.