కేసీఆర్’లో మార్పుపై రాములమ్మ సంచలన వ్యాఖ్యలు !

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వద్దవే ఇప్పుడు చేస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలని రద్దు చేశారు. ఎల్ఆర్ఎస్ పై వెనక్కి తగ్గారు. నిరుద్యోగులు, ఉద్యోగులని దగ్గర చేసుకొంటున్నారు. మొత్తంగా.. కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ వ్యవహార శైలి ప్రజలకి రాజకీయ నేతలకి ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తీరుపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“సీఎం కేసీఆర్ గారు కురిపిస్తున్న వరాల జల్లు చూస్తుంటే రాత్రికి రాత్రే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫిబ్రవరిలో పీఆర్సీ, ప్రమోషన్లు, బదిలీలు, సాగు చట్టాలకు సై అనడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గడం.. ఇలా గత నాలుగైదు రోజులుగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రకటనల మర్మమేంటో ఎవరికీ తెలియదనుకుంటే పొరపాటు. 

గడచిన టీఆరెస్ ఆరేళ్ళ పాలనా కాలంలో జనం గుండెలు బాదుకున్నా పట్టించుకోని సమస్యలపై ఇప్పుడు ఒకొక్కటిగా దృష్టి సారిస్తుండటం వెనుక కుట్ర కాక ప్రజా సంక్షేమం ఉందని ప్రజలు నమ్మే పరిస్థితుల్లేవు. అయితే, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలు ప్రభుత్వ అధినేత అహంకారాన్ని కొంత దారికి తెచ్చినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిణామాలే వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, రాబోయే ఉపఎన్నికల్లోనూ వస్తే… ఈ సీఎం గారు ఎంతో కొంత జన సంక్షేమం గురించి కనీసం ఆలోచింస్తారు.

తద్వారా మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ, సమయం, అపాయింట్‌మెంట్లు ఇచ్చి ప్రజా సమస్యలపై కొంత దృష్టి పెట్టే ప్రయత్నం జరగవచ్చు. అందుకోసమైనా తదుపరి ఎన్నికల ముందువరకూ కొంతకాలం అధికారంలో ఉండే ఈ టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ప్రతి సందర్భంలోను ఓటమి రుచి చూపించవలసిన బాధ్యత ఉందని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది” అని రాములమ్మ ట్విట్ చేశారు