ఏపీలో తెలంగాణ రాజకీయాలు

తెలంగాణలో భాజాపా హిట్ అయింది. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతో తెరాసకు ప్రత్యామ్నాయం అనిపించుకుంది. తెలంగాణలో రాబోయేది భాజాపా ప్రభుత్వమే అనే భరోసా ఏర్పడింది. దీంతో ఇతర పార్టీ నేతలు భాజాపాలోకి క్యూ కడుతున్నారు. అయితే ఏపీలో మాత్రం భాజాపా ఇంకా పుంజుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ భాజాపాకు తెలంగాణ భాజాపా నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికలో భాజాపా గెలుపే ప్రధానంగా పని మొదలెట్టారు.

సోమవారం హైదరాబాద్ భాజాపా ఆఫీసులో మాట్లాడిన బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులని సీఎం జగన్ తేలికగా తీసుకుంటున్నారు. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతేకాదు.. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని బండి సంజయ్ అన్నారు.

రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని బండి సంజయ్ విజ్ఝప్తి చేశారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో ఏపీ ప్రజలు తేల్చుకోవాలన్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికలో భాజాపా గెలుపు కోసం బండి సంజయ్ తన మార్క్ రాజకీయాలని మొదలుపెట్టారు. మరీ.. అవి ఫలిస్తాయా? తిరుపతిలో భాజాపా గెలుస్తుందా?? అన్నది చూడాలి.