అఖిలప్రియ ఏ2 కాదు ఏ1

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో రిమార్డ్ రిపోర్ట్ ని మార్చారు. నిన్నటి వరకు ఏ2గా ఉన్న అఖిలప్రియను నేడు ఏ1గా చేర్చిన పోలీసులు ఆమెపై మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నూతనంగా ఐపీసీ సెక్షన్ 147, 385 లను అదనంగా చేర్చి కేసులు మోపారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్ట్‌ రిలీజ్ చేశారు.

ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా పేర్కొన్నారు. ఇక ఏ3గా భార్గవ్ రామ్‌ను చేర్చారు. వీరితో పాటు శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాష్‌ పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. ఇక పరారీలో ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవ్‌రామ్‌ను వెతికి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు బెంగళూరుకు వెళ్లాయి.

హఫీజ్‌పేటలో సర్వేనెం.80లో 2016లో బాధితులు 25 ఎకరాలు కొన్నారని, భూమి తమదేనని అఖిలప్రియ, సుబ్బారెడ్డి, భార్గవ్‌రామ్‌ వాదిస్తున్నారని బోయిన్ పల్లి పోలీసులు తెలిపారు. సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్‌ చేసుకున్నారని.. అయితే భూమి ధర పెరగడంతో నిందితులు సమస్యలు సృష్టించారన్నారు.

మరోవైపు అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రజాప్రతినిధిగా ఉన్న అఖిలప్రియకు 41 సీఆర్పీసీ నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణని రేపటికి వాయిదా వేసింది.