గుడ్ న్యూస్ : ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ

దేశ ప్రజలకి గుడ్ న్యూస్. ఈ నెల 16 నుంచి కరోనా టీకా పంపిణీ చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించాం’ అని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సమీక్ష నిర్వహించారు. అనంతరం కరోనా ప్రకటనపై కేంద్రం ఈ ప్రకటన చేసింది.

ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి అందించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.