గ్రేటర్’‌లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం

తెరాస గ్రేటర్ హామీని నిలబెట్టుకుంది. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నగర వాసులకి ఉచితంగా మంచినీటిని పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని రహమత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌కు రెండ్రోజుల ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. తాను చదువుకునే రోజుల్లో తాగునీటి కోసం ధర్నాలు జరిగేవని.. ప్రస్తుతం ఉచితంగా తాగునీరు అందించే స్థాయికి చేరుకున్నాం.కులమతాలకు అతీతంగా పేదలంతా అభివృద్ధి చెందాలన్నదే తెరాస ధ్యేయమని స్పష్టం చేశారు. బస్తీల్లోని పేదలకోసం అన్ని సౌకర్యాలు కల్పించాం, బలహీన వర్గాల పిల్లలను విదేశాలకు పంపి చదివిస్తున్నాం” అని అన్నారు.