అందుకే.. ఆసీస్‌ బౌలర్లతో దెబ్బలు తిన్నా !


ఆసీస్ టూర్ లో నయావాల్ ఛెతేశ్వర్‌ పుజారా మరీ జిడ్డుగా ఆడటంపై విమర్సలొచ్చిన సంగతి తెలిసిందే. పుజారా జిడ్డుగా ఆడటం వలన ఇతర ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారని మాజీ ఆటగాళ్లు విమర్శించారు. కానీ పుజారా అవేమీ పట్టించుకోలేదు. వికెట్లు పడకుండా అడ్డుగా నిలబడ్డాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆసీస్ బౌలర్లతో దెబ్బలు కూడా తిన్నారు. తాజాగా దీనిపై ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

“గబ్బా టెస్టులో ఎలా ఆడాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. చివరిరోజు తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోకూడదని అనుకున్నా. ఎందుకంటే అది రెండు, మూడో సెషన్లలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా అవుతుంది. అయితే, అనుకోకుండా ఒక వికెట్‌ కోల్పోవడంతో పరుగులు రాకున్నా నేను క్రీజులో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత రెండు, మూడు సెషన్లలో ధాటిగా ఆడాలనుకున్నా. కానీ, అప్పటికే పిచ్‌లో అనూహ్య మార్పులు కనిపించాయి.

కొన్ని బంతులు తక్కువ ఎత్తులో రాగా, మరికొన్ని ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్‌ అయ్యాయి. దాంతో ఆ బంతులను ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది.ఆ బంతులను ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం కనిపించింది. అది ప్రమాదమని కూడా తెలుసు. కాకపోతే వేరే అవకాశం లేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు వేసే బంతులు గ్లోవ్స్‌కు తగిలితే అవి క్యాచ్‌లుగా వెళ్లే అవకాశం ఉండింది. దాంతో ఆ బంతుల్ని నా శరీరానికి తగిలించుకున్నా. బంతిని హెల్మెట్‌ మీద తగిలించుకోవడం మంచిదికాదు. అయినా, నేను దాని గురించి ఆలోచించలేదు.శరీరానికి తగిలినప్పుడు కొన్ని విపరీతమైన నొప్పిని కలిగించేవి” చెప్పుకొచ్చారు.

ఇక ఆసీస్ పర్యటనలో పుజారా మూడు అర్ధశతకాలు సాధించాడు. మొత్తం 271 పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.