న్యాయవాద దంపతుల హత్య : బిట్టు శ్రీను చెప్పిన షాకింగ్ నిజాలు

న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల దారుణ హత్య తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో తెరాస నేతల పేర్లు తెరపైకి వచ్చాయ్. తెరాస మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు.. బిట్టు శ్రీను షాకింగ్ నిజాలు చెప్పినట్టు తెలిపారు.

బిట్టు శ్రీనును వివిధ కోణాల్లో విచారించామని ఐజీ తెలిపారు. వామన్‌రావు గురించి కుంట శ్రీను, బిట్టు శ్రీను మధ్య చర్చ జరిగేది. వామన్‌రావును చంపకపోతే ఇబ్బందులుంటాయని కుంట శ్రీను చెప్పాడు. తన ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే కేసులని కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో చెప్పాడు. అవమానపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్నాడు. చంపేందుకు రెండు కత్తులు సిద్ధం చేయాలని చెప్పాడు. ట్రాక్టర్‌ పట్టీలతో కత్తులు చేయించి నిందితుడు చిరంజీవి ఇంట్లో పెట్టారు. హత్య చేసి బిట్టు శ్రీనుకు సమాచారం ఇచ్చాడు. మహారాష్ట్ర పారిపోవాలని కుంట శ్రీనుకు బిట్టు శ్రీను సూచించాడని ఐజీ మీడియాకు వివరించారు.