విశాఖ ఉక్కుపై జేడీ న్యాయ పోరాటం

విశాఖ ఉక్కు.. ఆంధ్రా హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయెద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమాలకు మద్దతుగా నిలిచిన మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ తాజాగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటిషన్‌లో కోరారు.

విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. విశాఖ ప్రయివేటీకరణపై ఆయన న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో జేడీ జనసేన తరుపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన జనసేన నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం మాత్రం ఆ మధ్య జరిగింది.