మాటలు కాదు..చేత‌లు కావాలి..!!

యాదాద్రి అభివృద్ధి ప‌నుల్లో వేగం మాటల్లో కాద‌ని, చేతల్లో చూపాల‌ని అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎంవో కార్య‌ద‌ర్శి భూపాల్ రెడ్డి. మంగ‌ళ‌వారం యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామివారిని ద‌ర్శించుకున్న ఆయ‌న అనంత‌రం ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. దాదాపు రెండు గంట‌ల పాటు అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న తీరును తిరిగి చూశారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌నులు జ‌ర‌గ‌ని చోట ఎందుకు జ‌ర‌గ‌లేదంటూ నిల‌దీశారు. అనంత‌రం అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

యాదాద్రి అభివృద్ధిప‌నుల్లో మ‌రింత వేగం పెంచాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ఆగ‌స్టు చివ‌రిక‌ల్లా సివిల్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని కాంట్రాక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సెప్టెంబ‌రు నెల చివ‌రి నాటికి ప‌నులు పూర్తి చేయాల‌ని తేల్చి చెప్పారు. ప‌నులు వీలైనంత వేగంగా పూర్తి చేసి భ‌క్తుల‌కు ప్ర‌దానాల‌యంలో స్వామివారి ద‌ర్శ‌నం క‌లిగేలా చేసేందుకు కృషి చేయాల‌న్నారు.