కేసీఆర్ కోలుకోవాలని.. ముడుపు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో.. నిన్న మధ్యాహ్నమే సీఎం కేసీఆర్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. యశోధ ఆసుపత్రి వైద్య బృందం సీఎం కేసీఆర్ కు చికిత్స చేస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలుస్తోంది.

మరోవైపు సీఎం కేసీఆర్ కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ తెరాసకు చెందిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆంజనేయస్వామికి ముడుపు కట్టారు. ఈ మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ తదితరులు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ట్విట్స్ చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ కు కరోనా నెగటివ్ అనే శుభవార్త వినేందుకు తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.