ఏపీలో భయానక పరిస్థితులు.. ఒక్కరోజులోనే 10వేల కేసులు !

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లోనే ఏపీలో 9,716 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703 మంది వైరస్‌ బారినపడ్డారు.మృతుల సంఖ్య 7,510కి చేరింది. 

నిన్న 3,359 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,18,985కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా శ్రీకాకుళంలో 1,444, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయ్. ఇక మృతుల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 10, నెల్లూరులో 7, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో 4గురు చొప్పున, చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురేసి; గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురంలో ఒక్కరు కరోనాతో చనిపోయారు.