ఆ నాలుగు రాష్ట్రాల సీఎం’లకు ప్రధాని ఫోన్

గత మూడ్రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్‌ చేసి కొవిడ్ పరిస్థితిపై ఆరా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రధాని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంలు ఉద్ధవ్‌ ఠాక్రే, ఎంకే స్టాలిన్‌, శివరాజ్‌ సింగ్ చౌహన్‌, జైరామ్ ఠాకూర్‌లకు వేర్వేరుగా ఫోన్‌ చేసిన ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితుల గురించి చర్చించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్‌ కట్టడికి కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని ఆ రాష్ట్ర సీఎం చౌహన్‌ ట్విట్ చేశారు. ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు హిమాచల్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ కూడా ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక మహారాష్టకు మరింత ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రధానిని కోరారు.