కేసీఆర్.. చిల్లర రాజకీయాలు పక్కనపెట్టండి : ఈటెల

ముఖ్యమంత్రి కేసీఆర్ చిల్లర రాజకీయాలు పక్కనపెట్టి.. కరోనా బాధితులని ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి, సీనియర్ నేత ఈటెల రాజేందర్. భూ ఆక్రమణ నేపథ్యంలో ఇటీవలే ఈటెలని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ కావాలనే ఈటెలని టార్గెట్ చేశారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు తనకు జరిగిన అన్యాయంపై ఈటెల దూకుడు చూపించకున్నా.. నెమ్మదిగా ముందుకెళ్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి కాస్త జోరు పెంచుతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటెల మరికొంత ఓపెన్ అయ్యారు. సీఎం కేసీఆర్ స్వ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తారని అన్నారు. ఇక కరోనా విజృంభిస్తున్న వేళ ఇలాంటి చిల్లర రాజకీయాలని పక్కనపెట్టాలని.. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా.. కరోనా చికిత్సని ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.