మంచి కథలను సినిమాలుగా తీయడమే లక్ష్యం : రాజ్‌ & డీకే

‘గో గోవా గాన్’, ‘స్త్రీ’ వంటి సినిమాలతో పాటు ‘ది ఫ్యామిలీమెన్’ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లో ప్రతిభను చాటుకున్నారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు). వీరు నిర్మాతలుగా మారి చేసిన తెలుగు చిత్రం ‘సినిమా బండి’. ప్రవీణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చిన సందర్భంగా నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.

“దర్శకుడు ప్రవీణ్ ఈ సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. మా అంచనాలకు మించిన స్పందన లభిస్తోంది. ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్‌ను కూడా ఆకట్టుకోవడం ఆనందంగా ఉంది. బాలీవుడ్ ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో పదిమంది వరకు కొత్తవాళ్లు వెండితెరకు పరిచయమయ్యారు. నిర్మాతలుగా సినిమాకు డబ్బులు పెట్టడమే కాకుండా పాటు స్ర్కిప్టింగ్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతి విభాగంలో మేం భాగస్వాములమయ్యాం. లాభాల గురించి ఆలోచించకుండా మంచి కథల్ని తెరకెక్కించాలన్నదే మా ఉద్దేశం” అన్నారు రాజ్ అండ్ డీకే.