కాకా పట్టేవాళ్లకే పాక్ జట్టులో చోటు

పీసీబీ వ్యవహారశైలిపై ప్రముఖ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్   తీవ్ర విమర్శలు గుప్పించాడు. పాక్ జట్టులో ఆటగాళ్ల ప్రతిభను చూడకుండా.. తమకు ఇష్టమైనవారినే ఎంపిక చేస్తారని ఆరోపించారు. మా వద్ద ఆటగాళ్లను ఇష్టపడటం, ఇష్టపడకపోవడం లాంటి పద్ధతి ఉంది. ఇది ప్రపంచంలోని ఇతర రంగాల్లో ఉన్నా మా క్రికెట్‌లో ఇంకాస్త ఎక్కువ ఉంది. మా క్రికెట్‌ బోర్డులో ఆటగాళ్లను తెలిసిన వ్యక్తులని కాకుండా వారి ప్రతిభ చూసి ఎంపిక చేసిన రోజే ఈ పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు.

ఇటీవల ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్‌ బాబర్‌ కావాలనుకున్న ఆటగాళ్లలో చాలా మందికి చోటుదక్కలేదు. తాను మిస్బాకు వ్యతిరేకం కాదు. అతడో మంచి క్రికెటర్‌. నేను అమితంగా గౌరవిస్తా. అయితే, అతడు జాతీయ జట్టుకు కోచ్‌గా చేయడానికి ముందు దేశవాళీ క్రికెట్‌లో పనిచేయాల్సింది. ఆ తర్వాతే పాక్‌ జట్టుకు రావాల్సింది. కెప్టెన్‌గా ఉండాలంటే ఇతరులను కాకా పట్టడం పనిచేయదు. అలాంటి వాళ్లెప్పుడూ సంతోషంగా ఉండరు. అలా చేస్తే ఎక్కువ కాలం కూడా కెప్టెన్‌గా కొనసాగరు అని మాలిక్‌ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.