కోహ్లీసేనకు శుభవార్త

దేశంలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది. సొంత దేశం, ఐర్లాండ్‌ పౌరులు మినహా మరెవ్వరినీ రానివ్వడం లేదు. ఇంగ్లాండ్‌ పర్యటన కోసం టీమ్ఇండియా మూడు నెలలు అక్కడే ఉండాలి. దీంతో బీసీసీఐ అక్కడి ప్రభుత్వంతో చర్చించి సడలింపులు సాధించింది. కోహ్లీ సేనకు కఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్‌ ప్రభుత్వం సడలింపులు కల్పించింది. ప్రయాణ ఆంక్షలను రద్దు చేసింది.

జూన్‌ 2న టీమ్‌ఇండియా బ్రిటన్‌కు బయల్దేరనుంది. 3వ తేదీ నుంచి భారత బృందం సౌథాంప్టన్‌లో కఠిన క్వారంటైన్‌లో ఉండనుంది. జూన్‌18న న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ఆడనుంది. ఆ తర్వాత నెలరోజులు సాధన మ్యాచులు ఆడి ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడుతుంది.