టెస్ట్.. వన్డే కానుందా ?

రసవత్తరంగా జరుగుతుందనుకొన్న WTC Final చాలా చప్పగా మారింది. రెండ్రోజులు (డే1, డే4) వరుణుడే తుడిచిపెట్టుకుపోయాడు. ఐదోరోజు ఆట ముగిసేసరికే న్యూజిలాండ్ కొద్దిగా ఆధిక్యంలో కనిపిస్తోంది. కానీ ఫలితం తేలడానికి ఇది సరిపోదు. మిగిలింది నేటి రిజర్వ్ డే మాత్రమే. ఈ  మ్యాచ్ ఫలితం తేలాంటే.. టెస్ట్ వన్డే గా మారితేనే.

ఐదోరోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 64/2తో నిలిచింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(30; 81 బంతుల్లో 2×4), శుభ్‌మన్‌గిల్‌(8; 33 బంతుల్లో) నిరాశపరిచారు. ప్రస్తుతం క్రీజులో చెతేశ్వర్‌ పుజారా(12; 55 బంతుల్లో 2×4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(8; 12 బంతుల్లో) ఉన్నారు.

అంతకుముందు 101/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఐదోరోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. మహ్మద్‌ షమి 4/76, ఇషాంత్‌ శర్మ 3/48 కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 32 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా 64/2తో ఆటని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ డే రోజున రెండు జట్లు ఇది టెస్ట్ అని మరచిపోయి.. వన్ డే తరహా ఆడితేనే మ్యాచ్ ఫలితం తేలేలా ఉంది. లేకుంటే.. తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ డ్రాగా ముగిసినట్టే.. !!