విషాదం : నటి రేష్మా కన్నుమూత

కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటి రేష్మా అలియాస్‌ శాంతి (42) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రయివేటు హాస్పటల్ లో చేరింది రేష్మా. ఆమెకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. దాంతో ఆమెకు కరోనా నయం అయింది అనుకున్నారు. అయితే శ్వాసకు సంబంధిత సమస్యలు తీవ్రమై సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూశారు.  బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.

కార్తీక్‌ హీరోగా తెరకెక్కిన ‘కిళక్కు ముగం’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రేష్మా పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ కుమారుడు హర్షవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకున్నారు. వీరికిద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రేష్మా మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.