మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. సామాన్యుడు ఏం కావాలె !

ఇప్పటికే పెట్రో ధరలు మండిపోతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటిపోయింది. డిజిల్ ధర వందకు చేరువగా ఉంది. ఈ నేపథ్యంలో సామాన్యుడు తల్లడిల్లిపోతున్నాడు. అసలే కరోనా టైమ్. నిత్యవసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. తాజాగా డీజిల్‌ ధరలను సైతం పెంచాయి. తాజాగా పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసల వరకు వడ్డించాయి. 

పెరిగిన ధరలతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.51, డీజిల్‌ రూ.89.36కు చేరాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.98, డీజిల్‌ రూ.96.91కు పెరిగింది. మే 4వ తర్వాత నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధరలను చమురు కంపెనీలు 35 సార్లు పైకి కదలగా.. ఇప్పటి వరకు మొత్తం రూ.9.19 వరకు పెరిగింది. డీజిల్‌ రేట్లు 34 సార్లు పెరగ్గా.. రూ.8.57 వరకు పెరుగుదల నమోదైంది.