మళ్లీ పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నా.. మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగుచూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 3.07 కోట్ల మందికిపైగా కరోనా సోకగా..4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది.