నాగార్జునతో పాన్‌ ఇండియా మూవీ.. అలా ఆగిపోయింది !

టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వైపు పరుగులు తిరుగుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా సినిమాలే చేయబోతున్నారు. స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కూడా పాన్ ఇండియా మూవీనే. రెండు భాగాలు రానుంది. టాలీవుడ్ లో పాన్ ట్రెండ్ నడుస్తోంది.

అయితే అప్పట్లోనే కింగ్ నాగార్జునతో పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేశారట దర్శకుడు బి. గోపాల్ రెడ్డి. కాకపోతే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని తెలిపారు. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న గోపాల్ రెడ్డి.. నాగ్ తో ప్లాన్ చేసిన పాన్ ఇండియా మూవీ ముచ్చట్లు పంచుకున్నారు. నాగార్జునతో పాన్ ఇండియా సినిమా అనుకున్నాం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా రాసిన స్ర్కిప్టు అది. వేగవంతమైన సన్నివేశాలతో 48 గంటల్లో సాగే కథ. తనకి విషం ఎక్కించిన ముగ్గురు విలన్లని హీరో చంపాలి.

ఒక్కో విలన్‌ ఒక్కో రాష్ట్రంలో ఉంటాడు. వారిని అన్వేషించే మార్గంలో హీరో ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఇందులో నటించేందుకు డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది. వారంలో ప్రారంభమవుతుందనే సమయంలో చిన్న సందేహం కలిగింది. నాకూ కె.ఎల్‌. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేస్తే బాగుంటుందనిపించింది. దానికి అశోక్‌ మెహతా నో అన్నారు. అందుకే ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు’ అని చెప్పుకొచ్చారు.