జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ

జమిలి ఎన్నికలపై కేంద్రం మరోసారి స్పష్టతనిచ్చింది. బుధవారం లోక్‌సభలో ప్రదీప్‌కుమార్‌ సింగ్‌ అనే సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం ఇచ్చారు.

“ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజాజీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు వారికి అందే అత్యవసర సేవలపైనా ప్రభావం పడుతోంది. అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిపితే ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 79వ నివేదికలో పేర్కొంది. ఎన్నికల సంఘంతో సహా వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి తగు సిఫార్సులు చేసింది.

ఆ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపాం. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్‌ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసింది. ఇవి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి” అని కిరణ్‌ రిజిజు తెలిపారు. దేశంలో 2014-19 మధ్యకాలంలో జరిగిన 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.