విజయ్ థియేటర్ రెడీ.. లవ్ స్టోరీతో ఓపెన్ !

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త బిజినెస్ లోకి దిగారు. మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి ఆయన సొంత జిల్లా మహబూబ్‌ నగర్‌లో బిగ్‌స్క్రీన్‌ నిర్మించారు. నగరంలోని తిరుమల థియేటర్‌ స్థానంలో ఏషియన్‌ విజయ్‌దేవరకొండ సినిమాస్‌ మల్టీప్లెక్స్‌ సిద్ధమైంది. సెప్టెంబర్‌ 24న ఈ థియేటర్‌ ప్రారంభం కానుంది. లవ్ స్టోరీ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్‌ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు.

“నటుడు కావాలని కలలు కన్న రోజులు.. దాని కోసం కష్టపడిన రోజులు.. గుర్తు చేసుకుంటుంటే అవన్నీ నిన్నే జరిగాయి అన్నట్టు ఉంది. నటుడిగా మిమ్మల్ని అలరించిన నేను ఇప్పుడు మీకు మరింత వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో మల్టీప్లెక్స్ ప్రారంభించాను. నా తల్లిదండ్రుల సొంతూరైన మహబూబ్‌నగర్‌లో నా మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ (ఏవీడీ-ఏషియన్‌ విజయ్‌ దేవరకొండ సినిమాస్‌) ఇది. సాయిపల్లవి, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమాతో ‘ఏవీడీ’ ప్రారంభం కానుంది. నా కెరీర్‌ శేఖర్‌గారి వద్ద మొదలైంది. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన సినిమాతోనే ఏవీడీ ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఏవీడీ ప్రారంభ కార్యక్రమానికి మహబూబ్‌నగర్‌లో ఉండాలనుకున్నాను. కానీ గోవాలో ‘లైగర్‌’ కోసం బిజీగా ఉండటం వల్ల అక్కడికి రాలేకపోతున్నా. ఇది నా జీవితంలో చాలా గొప్ప విషయం” అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.