ఇంగ్లాండ్ సిరీస్ గెలిచేసినట్టే

ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉండగా.. కరోనా కారణంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఆఖరి టెస్టు రద్దయింది. వచ్చే ఏడాది జులైలో ఈ మ్యాచ్‌ ఆడతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రకటించాడు.

తాజాగా చివరి టెస్టుపై టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ స్పందించారు. “చివరి టెస్టు విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. వచ్చే ఏడాది ఒక్క టెస్టే ఆడాల్సొచ్చినా.. నా వరకు మాత్రం 2-1తో మేం సిరీస్‌ గెలిచేశాం. నా టెస్టు కెరీర్‌ ప్రకారం ఇంగ్లాండ్‌ పర్యటన మంచి సిరీస్‌ అన్నట్లే. కాని అత్యుత్తమ సిరీస్‌ మాత్రం కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రావాల్సి ఉంది. సౌథాంప్టన్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నా. అవసరమైన టెక్నిక్‌, ఆలోచన విధానంపై కసరత్తు చేశా. భవిష్యత్తులోనూ ఇదే ఆటతీరే కొనసాగించాలని కోరుకుంటున్నా” అని రోహిత్‌ వివరించాడు.